AC Compressor : ఏసీ కంప్రెషర్..17 మందిని బలి తీసుకుంది
AC Compressor : హైదరాబాద్ పాతబస్తీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో ఓ బంగారు దుకాణం యజమాని ఇంట్లో ఏసీ కంప్రెషర్ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో వచ్చిన భారీ పొగ వల్ల ఇంట్లో ఉన్న వారు ఉక్కిరిబిక్కిరయ్యారు. శ్వాస తీసుకోలేక స్పృహ తప్పిన వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. సహాయక చర్యల సమయంలో ఆస్పత్రికి తరలించిన వారిలో మరికొంత మంది మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 17కి చేరుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు.
ఈ భవనంలో బెంగాల్కు చెందిన బంగారు వ్యాపారి కుటుంబంతో పాటు అతని బంధువులు కూడా నివాసముండగా, ప్రమాదం రాత్రి సమయంలో జరిగింది. నాలుగు కుటుంబాలకు చెందిన వారు పై అంతస్తులో నిద్రిస్తున్న సమయంలో ఏసీ పేలుడు సంభవించింది. పొగ విపరీతంగా వ్యాపించడంతో కిందకు దిగేందుకు ప్రయత్నించిన వారు, మెట్ల తలుపు మూసివుండటంతో ఎక్కడికీ వెళ్లలేకపోయారు. మెట్లు కూడా గుహలా ఉండటంతో బయటకు రావడం సాధ్యపడలేదు. పొగ మరింత పెరగడంతో ప్రాణాలు కోల్పోయారు.

AC Compressor : ఏసీ కంప్రెషర్..17 మందిని బలి తీసుకుంది
ఈ ప్రమాదంపై ప్రభుత్వం తీవ్ర స్పందన తెలిపింది. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్య నేతలు ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదానికి కారణం ఏసీ పేలుడు వల్ల జరిగిన షార్ట్ సర్క్యూట్ అని నిర్ధారణ అయింది. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఈ సంఘటన మరింత విషాదంగా మారింది.