Konda Surekha Vijayashanti : కొండా ఔటైతే రాములమ్మ ఇన్..? తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవిపై ఉత్కంఠ..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 26 August 2026, 11:31 am
  •  Konda Surekha Vijayashanti తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కొండా సురేఖతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై కూడా క్రమశిక్షణా చర్యలు

Konda Surekha Vijayashanti : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కొండా సురేఖతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. ఎంపీ మల్లు రవి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ తన నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖను పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆమె తన వైఖరిని మార్చుకోలేదని క్రమశిక్షణా కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. అలాగే గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి పార్టీ గౌరవించిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ పరిణామాల నేపథ్యంలో అసలు కొండా సురేఖపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుంది? అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Konda Surekha Vijayashanti : కొండా ఔటైతే రాములమ్మ ఇన్..? తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవిపై ఉత్కంఠ..!

Konda Surekha Vijayashanti : కొండా ఔటైతే రాములమ్మ ఇన్..? తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవిపై ఉత్కంఠ..!

Konda Surekha Vijayashanti కొండా స్థానంపై పలువురు నేతల కన్ను.. ఢిల్లీ స్థాయిలో పైరవీలు?

కొండా సురేఖపై వేటు పడే పరిస్థితి వస్తే, ఖాళీ అయ్యే మంత్రి పదవిపై ఇప్పటికే పలువురు ఆశావహులు దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు నేతలు ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారని, పార్టీ అధిష్టానం పెద్దల మద్దతు కోసం ముఖ్యనేతలను కలుస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే, ఆమె స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు నేతకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే కోణంలో ఆయనకు అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది.ఇదే సమయంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. దీంతో మంత్రి పదవుల రేసులో ఉన్న నేతల సంఖ్య మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.

అయితే కొండా సురేఖ స్థానంలో తనకు అవకాశం ఇవ్వాలని ప్రముఖ నటి, ఎమ్మెల్సీ విజయశాంతి కోరుతున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా తనకు క్యాబినెట్‌లో చోటు కల్పించాలని ఆమె పార్టీ అధిష్టానం పెద్దల ముందు తన ప్రతిపాదనను ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో కొండా స్థానంలో ‘రాములమ్మ’కు అవకాశం దక్కుతుందా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలాకాలంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే అదే గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ఇప్పటికే మంత్రిగా ఉండటం ఆయనకు ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఖాళీ మంత్రి పదవుల కోసం భారీ పోటీ.. ఎవరి ఆశలు నెరవేరుతాయి?

కొండా సురేఖ స్థానంతో పాటు ఖాళీగా ఉన్న ఇతర మంత్రి పదవులపై కూడా పలువురు కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ఇచ్చిన హామీని అధిష్టానం నిలబెట్టుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. భువనగిరి ఎంపీని గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది.అయితే సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధిష్టానం రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశం ఆయన మంత్రి పదవి ఆశలకు ప్రతికూలంగా మారుతుందా? అన్న సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక లంబాడా సామాజిక వర్గం నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా యాదవ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆశిస్తున్నట్లు సమాచారం.బీర్ల అయిలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ గతంలోనే బలంగా వినిపించింది.

యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ గాంధీభవన్‌లో ఆందోళన కూడా నిర్వహించారు. దీంతో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీ అంతర్గత సమీకరణాలు.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.మొత్తంగా చూస్తే కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కేవలం ఒక నేత పదవికి సంబంధించిన అంశంగా కాకుండా, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు దారితీసే పరిణామంగా మారుతుందా? అనే ఆసక్తి నెలకొంది. కొండా సురేఖపై అధిష్టానం వేటు వేస్తే ‘రాములమ్మ’ విజయశాంతికి అవకాశం వస్తుందా? ఆది శ్రీనివాస్ పేరు ఖరారవుతుందా? లేక మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న మరో నేతకు ఛాన్స్ దక్కుతుందా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp