Telangana Revenue Department : తెలంగాణ రెవెన్యూశాఖలో భారీ సంస్కరణలు
Telangana Revenue Department : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో, ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరు లైసెన్స్డ్ సర్వేయర్లు నియమించనున్నారు. భూ సమస్యలపై గ్రామస్థులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ఇప్పటికే 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతలో 7 వేల మందికి శిక్షణ పూర్తిచేసి తుది పరీక్షలు, ల్యాబ్ ప్రాక్టికల్స్ నిర్వహించి ఫలితాలను ఆగస్టు 12న ప్రకటించనున్నారు.
రాష్ట్రంలోని భూభారతి చట్టం ప్రకారం భూ రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి కావడంతో సర్వేయర్ల అవసరం పెరిగింది. అదే దృష్టిలో ఉంచుకుని, 50 రోజుల శిక్షణ అనంతరం అప్రెంటిస్ శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, రెవెన్యూ గ్రామాల్లో సేవలందించేందుకు వీఆర్వో, వీఆర్ఏల ఎంపిక ప్రక్రియలో 3554 మంది ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. వీరిలో మరికొందరికి అవకాశం కల్పించేందుకు జూలై 27న మరోసారి అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఇది ప్రజలకు నేరుగా సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగం.

Telangana Revenue Department : తెలంగాణ రెవెన్యూశాఖలో భారీ సంస్కరణలు
ఇక నక్షా లేని గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మొత్తం 413 గ్రామాల్లో నక్షాల సమస్య ఉన్నప్పటికీ, మొదటి దశలో మహబూబ్నగర్, జగిత్యాల, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఐదు గ్రామాల్లో రీ-సర్వే విజయవంతంగా పూర్తయింది. రైతుల సమక్షంలో భూముల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, భూ వివాదాలు తేలిపోతాయని మంత్రి అన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను పరిశీలించి మిగతా గ్రామాల్లోనూ ఈ రీ-సర్వే పద్ధతిని అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.