Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏ ఫైల్ మీద తొలి సంతకం పెట్టారు? దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇచ్చారా?

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 7 December 2023, 3:45 pm
  •  తొలి సంతకం ఆరు గ్యారెంటీ హామీల పైనే

  •  రెండో సంతకం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఫైల్ పై

  •  ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మరో 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులతో తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో చేసిన తొలి సంతకనం ఆరు గ్యారెంటీ హామీలపై. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే తొలి సంతకం ఆరు గ్యారెంటీ హామీలపైనే పెట్టారు. ఆ తర్వాత అభయ హస్తం చట్టానికి మార్గం సుగుమం చేస్తూ సంతకం చేశారు.

ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తా అని రేవంత్ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మాటను నెరవేర్చుతూ రెండో సంతకం రజనీ ఉద్యోగానికి సంబంధించిన ఫైల్ పై రేవంత్ సంతకం పెట్టారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జై సోనియమ్మ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం, ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, సామాజిక న్యాయం చేయాలని, ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సోనియా గాంధీ ఉక్కు సంకల్పం కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు.

Revanth Reddy : ప్రగతి భవన్ కంచెలు తెంచుకున్నాయి

దశాబ్దకాలంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్యకు లోనయి, మానవ హక్కులకు భంగం కలిగి ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక దశాబ్ద కాలంలో మౌనంగా భరించిన 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో ఎన్నో త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజారాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. తెలంగాణ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుంది. ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్ధలు కొట్టించడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను మాట ఇస్తున్నా. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలని అనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనలను, తమ ఆకాంక్షలను, తమ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు అని అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. మా తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడటం కోసం మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వర్తిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి