KGKS : జూలై 10న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి : తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం

 Authored By kranthi | The Telugu News | Updated on :8 July 2023,3:00 pm

రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

KGKS  :గీత కార్మికులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయ రాములు అన్నారు. జులై 10 సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాలో పెద్ద ఎత్తున గీత కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భువనగిరి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత అక్టోబర్ మాసంలో యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలను పురస్కరించుకొని నిర్వహించిన గీత కార్మికుల భారీ బహిరంగ సభ ప్రభావంతో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం పెట్టి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కల్లు గీత కార్మికులకు, గౌడ సోదరులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు జరుగుతున్న ధర్నాలో భాగంగా జులై 10 సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. సభ్యత్వం ఉన్న ప్రతి గీత కార్మికుడికి మోటర్ బైకులు,రాష్ట్ర టాడి కార్పొరేషన్ కు నిధులు కేటాయించి రాష్ట్రంలోని గీత కార్మికులందరికీ ఉచితంగా సేఫ్టీ మోకులు అందించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ కుల వృత్తిదారులకు ప్రభుత్వం ఇస్తామన్న లక్ష రూపాయల ఆర్థిక సహాయం గౌడ కులస్తులకు, కల్లు గీత కార్మికులకు వర్తింపచేయాలని, గీత కార్మికులందరికీ సాధారణ మరణాలకు కూడా ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా గీతన్న బీమా పథకం ఇవ్వాలని, వృత్తిలో ప్రమాదవశత్తూ చెట్టుపై నుండి కింద పడి మృతి చెందినా, శాశ్వత వైకల్యం పొందిన కార్మికులకు ఇస్తున్న ఎక్స్ గ్రేషియా 10 లక్షల రూపాయలకు పెంచాలని మెడికల్ బోర్డు నిబంధనలు తొలగించాలని సొసైటీలకు 5 ఎకరాల భూమి కేటాయించి, కల్లుకు మార్కెట్, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని వారు అన్నారు.

Telangana Kallu geetha karmika sangham protest on july 10

Telangana Kallu geetha karmika sangham protest on july 10

560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. జులై 10న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు  వేలాది మంది గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల బిక్షపతి, కొక్కొండ లింగయ్య, జిల్లా కమిటీ సభ్యులు భువనగిరి మండల అధ్యక్షులు, కార్యదర్శులు పాండాల మైసయ్య, మట్ట బాలరాజు, కొండ అశోక్, నాయకులు రంగా కొండల్, బుడిగే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి