Business Ideas : చిన్న ఐడియా తన జీవితాన్నే మార్చేసింది.. రూ. 11 వేల పెట్టుబడితో కోటి సంపాదిస్తోంది..

Authored By Jyothi Marikanti | The Telugu News | Updated on : 11 March 2022, 12:00 pm

Business Ideas : ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఈ స్లోగన్ ఒక సెల్యూలార్ కంపెనీది. కానీ, ఇది 110 శాతం నిజం. ఆ నిజ జీవిత కథలు మనకు అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అప్పటి వరకు సామాన్యులుగా ఉన్న వారిని ఆ ఒక్క ఐడియా సంపన్నులను చేస్తుంది. సాధారణ జీవితం గడిపే వారిని సెలబ్రిటీని చేస్తుంది. ఇది కూడా అలాంటి స్టోరీయే. ఈ కోటీశ్వరురాలి పేరు శిల్పి సిన్హా. ఎనిమిదేళ్ల క్రితం వరకు ఝార్ఖండ్ లోని డాల్టన్ గంజ్ లో ఉండేది. రోజూ ఉదయం లేవగానే ఓ కప్పు పాలను తాగడం శిల్పి సిన్హా  అలవాటు. ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చిన శిల్పి… తన అలవాటు ప్రకారమే ఓ రోజు ఉదయం పాలను తాగింది. కానీ అవి ఎందుకో టేస్టీగా అనిపించలేదు.

ఎందుకంటే అవి కల్తీ పాలు. స్వచ్ఛమైన పాల కోసం బెంగళూరులో చాలా ప్రయత్నాలే చేసింది. కానీ తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కల్తీ పాల వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకున్న శిల్పి తానే ఆవు పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. పాడి రైతులను కలవడం ప్రారంభించింది. ఆవుల దాణా, వాటి సంరక్షణ గురించి పూర్తి వివరాలు సేకరించింది. స్వచ్ఛమైన పాలను తనకు అమ్మాలని ఇతరుల కంటే ఎక్కువ ధరే ఇస్తానని చెప్పడంతో… రైతులు శిల్పికి స్వచ్ఛమైన పాలను అమ్మేందుకు అంగీకరించారు. కానీ.. ఆ పాలను సేకరించే వాళ్లు మొదట శిల్పి దొరకలేదు. దాంతో తనే తెల్లవారుజామున 3 గంటలకు రైతుల వద్దకు వెళ్లేది. పాలను సేకరించి బెంగళూరులో అమ్మడం మొదలు పెట్టింది.

crore rupees turnover with only eleven thousand rupees investment

crore rupees turnover with only eleven thousand rupees investment

ఆమె నిజాయితీ, పాలలోని స్వచ్ఛత ఆ నోటా ఈ నోటా తెలిసి క్రమంగా తన వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూండటంతో రెండేళ్ల క్రితం తన సంస్థకు ది మిల్క్ ఇండియా అనే పేరు పెట్టింది శిల్పి. నాణ్యమైన పశుగ్రాసాన్ని ఇస్తే ఆరోగ్యకరమైన పాలు వస్తాయని, ఆ పాలకు మంచి ధర ఇస్తానని రైతులకు చెప్పింది శిల్పి. కానీ మొదట రైతులెవరూ తన మాట నమ్మలేదు. క్రమంగా శిల్పి అధిక ధర చెల్లించడంతో వారు శిల్పిని నమ్మడం మొదలు పెట్టారు. కర్ణాటక, తమిళనాడులోని 21  గ్రామాల్లోని రైతులు ఇప్పుడి ది మిల్క్ ఇండియాకు పాలు విక్రయిస్తున్నారు. 11 వేల రూపాయలతో మొదలైన ది మిల్స్ ఇండియా రెండేళ్లలోనే  కోటి రూపాయల టర్నోవర్ సాధించింది.

Jyothi Marikanti

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp