Maha Shivaratri : శివుడు బ్రహ్మకు, మొగలిపువ్వుకు ఎందుకు శాపం ఇచ్చాడు ?

Authored By Devotional Desk | The Telugu News | Published on: March 10, 2021, 8:00 am

Maha Shivaratri : శివుడు బ్రహ్మకు, మొగలిపువ్వుకు శాపం ఇచ్చాడు అని శివపురాణంలో తెలుసుకున్నాం, అయితే ఎందుకు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.. శివుడు పెట్టిన పరీక్షలో బ్రహ్మ, మొగలి పువ్వులు అసత్యం పలికినందుకు వారికి శిక్ష విధిస్తాడు మహాదేవుడు. శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు.

మొగలి పువ్వు:బ్రహ్మకు శాపం ఇచ్చిన తర్వాత శివుడు కేతకీపుష్పము అంటే మొగలిపువ్వు వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

Shocking Facts About Lord Shiva and Bhramma

Shocking Facts About Lord Shiva and Bhramma

Maha Shivaratri : కామధేనువుకు శాపము

అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, “మొగముతో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును” అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుతున్నవి. ఇలా బ్రహ్మకు, మొగలిపువ్వు, కామధేనువుకు శివుడు శాపాలను పెట్టాడు. కాబట్టి ఎవరైనా ఈకథలోని ఆంతర్యం గమనించి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడకూడదని గ్రహించుకోవాలి. సత్యవాక్కు పాలనతో జీవితం సాగించాలి అని శివరాత్రి మనకు బోధిస్తుంది.

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp