Mohan Babu – Vishnu : విద్యార్థి నేతల కిడ్నాప్‌ కలకలం: మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mohan Babu – Vishnu : విద్యార్థి నేతల కిడ్నాప్‌ కలకలం: మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు

 Authored By suma | The Telugu News | Updated on :4 February 2026,11:45 am

ప్రధానాంశాలు:

  •  Mohan Babu - Vishnu : విద్యార్థి నేతల కిడ్నాప్‌ కలకలం: మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు

Mohan Babu – Vishnu : తిరుపతి జిల్లాలో  Tirupati District విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీశాయి. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో  Mohan Babu University  ఫీజుల దోపిడీ, అక్రమాలపై నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి నేతలను కిడ్నాప్‌ చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్‌, ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వినోద్‌ మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించేందుకు బయలుదేరగా తిరుచానూరు సమీపంలో 30 మంది దుండగులు వారిని అడ్డగించారు. బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి నేతల అపహరణ వార్త జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న సీపీఎం నాయకుడు కందారపు మురళి వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Case registered against Mohan Babu and Vishnu

Mohan Babu – Vishnu : విద్యార్థి నేతల కిడ్నాప్‌ కలకలం: మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు

Mohan Babu – Vishnu : పోలీసుల వేగవంతమైన చర్యలు

కిడ్నాప్‌ జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అపహరణకు ఉపయోగించిన వాహనాల వివరాలు సేకరించి వివిధ మార్గాల్లో గాలింపు చేపట్టారు. గంట వ్యవధిలోనే నారావారిపల్లె సమీపంలో కిడ్నాపర్ల వాహనాలను గుర్తించిన పోలీసులు బాధితులను సురక్షితంగా విడిపించారు. ఈ సందర్భంగా నిందితులను అదుపులోకి తీసుకుని ఘటనకు ఉపయోగించిన వాహనాలను సీజ్‌ చేశారు. బాధితుల వాంగ్మూలాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. విద్యార్థులపై దాడి, అక్రమ నిర్బంధం, కిడ్నాప్‌ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో తిరుపతిలో భద్రతా వ్యవస్థపై కూడా చర్చ మొదలైంది

Mohan Babu – Vishnu : మోహన్‌బాబు, విష్ణులపై కేసులు .. యాజమాన్య ప్రతివాదం

బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు మోహన్‌బాబు యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్‌ను ఏ-1గా నటుడు మోహన్‌బాబును ఏ-2గా మంచు విష్ణును ఏ-3గా కేసులో చేర్చారు. ఈ పరిణామం రాజకీయ, సినీ వర్గాల్లోనూ ఆసక్తి రేపింది. అయితే ఈ ఆరోపణలను యూనివర్సిటీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తమ విద్యాసంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు వీడియోలు పోస్టు చేసి అవి తొలగించాలంటే రూ.15 లక్షలు ఇవ్వాలని ఇద్దరు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్‌ చేశారని యాజమాన్యం ఆరోపించింది. డబ్బులు ఇవ్వకపోతే ధర్నాలు, ఆందోళనలు చేస్తామని బెదిరించారని తెలిపింది. దీనికి సంబంధించి వాట్సాప్‌ చాట్లను చంద్రగిరి పోలీసులకు అందజేశామని పీఆర్‌వో సతీష్‌ వెల్లడించారు. ఈ పరస్పర ఆరోపణల మధ్య పోలీసులు రెండు కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు. విద్యార్థి నేతల కిడ్నాప్‌ నిజంగానే పన్నిన కుట్రేనా? లేక ఆరోపణలు ప్రతిఆరోపణల వెనుక మరేదైనా కారణాలున్నాయా? అన్న దానిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని అధికారులు స్పష్టం చేశారు. తిరుపతి విద్యార్థి రాజకీయాల్లో ఈ ఘటన ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సిందే.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది