Uppal : అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోరుతూ కమిషనర్కు వినతి
ప్రధానాంశాలు:
Uppal : అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోరుతూ కమిషనర్కు వినతి
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉప్పల్ అసెంబ్లీ పరిధిలో అనేక కాలనీల్లో అభివృద్ధి పనులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు.
పలు ప్రాంతాల్లో సీసీ రహదారులు దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నాయని, తాగునీరు, వర్షపు నీటి కాలువలు సక్రమంగా లేవని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్స్ లేకపోవడంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ అవసరమైన మౌలిక వసతులు లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలో చిలకనగర్ డివిజన్లో గణేష్ దేవాలయం సమీపంలో కల్వర్ట్ నిర్మాణం, సీతారామ కాలనీలో కమ్యూనిటీ హాల్, బీరప్పగడ్డలో గౌడ్స్ మరియు విశ్వకర్మ శ్మశానవాటికల అభివృద్ధి, రామంతాపూర్లో కమ్యూనిటీ హాల్ విస్తరణ వంటి పనులను ప్రాధాన్యతగా చేపట్టాలని కోరారు. అదనంగా దెబ్బతిన్న సీసీ రహదారుల పునర్నిర్మాణం కూడా అవసరమని పేర్కొన్నారు.
కాప్రా సర్కిల్ పరిధిలో ఉషోదయ సూపర్ మార్కెట్ సమీపంలో సీసీ రహదారి, ఎల్లారెడ్డిగూడలో కాంపౌండ్ వాల్, బాక్స్ డ్రెయిన్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, శాలివాహన కాలనీ వద్ద ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు వంటి పనులను ప్రతిపాదించారు. అలాగే చర్లపల్లి, హెచ్బీ కాలనీ, మల్లాపూర్ డివిజన్లలో శ్మశానవాటికలు, సీనియర్ సిటిజన్ భవనాలు, ఆర్సీసీ పైప్లైన్లు, రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ అభివృద్ధి పనులకు తగిన నిధులు కేటాయించి త్వరితగతిన అమలు చేయాలని కమిషనర్ను పరమేశ్వర్ రెడ్డి కోరారు.