Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటన.! మళ్ళీ అదే పాత కథ.!

 Authored By aruna | The Telugu News | Updated on :22 August 2022,11:30 am

Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ వేదికపైనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెడలో బీజేపీ కండువా కప్పి, బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. షరామామూలుగానే పలువురు బీజేపీ నేతలు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేశారు.. కేంద్ర మంత్రి అమిత్ షా సహా.! అయితే, ఈ సభకు ఒక్క రోజు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ఇదే మునుగోడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలో కేసీయార్, కొన్ని ప్రశ్నలు సంధించారు. అందులో, రైతులకు విద్యుత్ మీటర్లు సహా, తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి ప్రశ్నలు వేశారు కేసీయార్.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ పర్యటన సందర్భంగా, కేసీయార్ ప్రశ్నలకు సమాధానం చెప్పి వుండాలి. కానీ, అలాంటి ముచ్చటే లేకుండా పోయింది. అమిత్ షా, తెలంగాణకి వచ్చారు, వెళ్ళారు.. అన్నట్టు తయారైంది వ్యవహారం. కేసీయార్ ప్రశ్నాస్త్రాల గురించి అమిత్ షా పెదవి విప్పలేదు. పైగా, ‘కేసీయార్ సంధించే ప్రతి ప్రశ్నకూ తమ వద్ద సమాధానం వుందని’ మాత్రమే తెలంగాణ బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే, అధికార పార్టీ సంధించే ప్రశ్నలకు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ సమాధానం చెప్పి తీరాలి. కేంద్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సమాధానాల అందాలి.

Amit Shah Telangana Tour, Same Old Story.!

Amit Shah Telangana Tour, Same Old Story.!

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరధ.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా అంశాలున్నాయి. వేటికీ కేంద్రం నుంచి సమాధానాలు రావడంలేదు. వచ్చే అవకాశమూ లేదు. ఇదొక ప్రసహనం. ఇదిలాగే కొనసాగుతుంది. కేసీయార్‌ది కుటుంబ పాలన, కేసీయార్‌ని గద్దె దించుతాం.. ఇలా షరామామూలు విమర్శలకే బీజేపీ కేంద్ర నాయకత్వం పరిమితమవుతోంది. మొన్నామధ్య ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చినప్పడూ ఇవే మాటలు. ఆయన డబుల్ ఇంజిన్ సర్కారు.. అని చెప్పి ఊరుకున్నారంతే. ఈమాత్రందానికి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకింత గుస్సా అవ్వాలి.?

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి