Khammam : ఖమ్మం రహదారులకు నూతన దిశ .. ఐదు ప్రధాన మార్గాల విస్తరణ
ప్రధానాంశాలు:
Khammam : ఖమ్మం రహదారులకు నూతన దిశ .. ఐదు ప్రధాన మార్గాల విస్తరణ
Khammam : ఖమ్మం జిల్లా ప్రజల దశాబ్దాల ఆశలు నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. జిల్లాలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం భారీ ప్రణాళికను అమలు చేయబోతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో జిల్లాలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణకు రూ.594 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు 2026 మార్చి 16న జారీ చేసిన జీవో ఎంఎస్ 15 ద్వారా ఈ ప్రాజెక్టుకు అధికారిక ఆమోదం లభించింది. ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న కీలక రహదారులను నాలుగు లేన్ల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అమలులో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానాన్ని అనుసరించడం విశేషం. ఈ పద్ధతిలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఉండటంతో పనులు వేగంగా పూర్తి అయ్యే అవకాశముంది.
ప్రభుత్వం ఏర్పడిన తొలి దశ నుంచే జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సులభ రాకపోకలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు త్వరగా తరలించేందుకు ఈ రహదారులు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ విస్తరణతో ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాల మధ్య కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది. రవాణా ఖర్చులు తగ్గడంతో రైతులు, వ్యాపారులు లాభపడే అవకాశముంది. ఈ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో సమగ్రాభివృద్ధికి దారితీసే కీలక మలుపుగా నిలవనుంది. గ్రామీణ-పట్టణ మధ్య అంతరాన్ని తగ్గిస్తూ, ప్రాంతీయ ప్రగతికి కొత్త దిశను చూపనుంది.
రహదారులు విస్తరణ..
1. వైరా నుండి జగ్గయ్యపేట వరకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసల రహదారిగా విస్తరణ జగ్గయ్యపేట, బోనకల్ , రావినూతల, ముజఫర్ నగర్, జానకీపురం, పెద్దబీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తండా. సోమవరం మీదుగా వైరా వరకు. ఈ రహదారి మొత్తం 25.2 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.151.20 కోట్ల నిధుల మంజూరు.
2. మధిర నుంచి తూటికుంట్ల వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణ. మధిర, జిలుగుమాడు, ఆత్కూరు, కిష్టాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్యణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు విస్తరణ. ఈ రహదారి మొత్తం 13.50 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు రూ. 81 కోట్ల నిధుల మంజూరు.
3. మధిర నుంచి ఎర్రుపాలెం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ. మధిర, ఎల్లెందులపాడు, దెందుకూరు, మీనవోలు మీదుగా ఎర్రుపాలెం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ. ఈ రహదారి మొత్తం 18.40 కిలోమీటర్ల మేర రూ.110.40 కోట్ల నిధులు మంజూరు.
4. ఖమ్మం నుంచి బోనకల్ వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ. ఖమ్మం, కొత్తూరు, దంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు రహదారి విస్తరణ. మొత్తంగా 28.03 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు రూ.157.23 కోట్ల నిధుల మంజూరు.
5. బోనకల్-ఆళ్లపాడు, రాయన్నపేట-వంగవీడు వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ. బోనకల్, ఆళ్లపాడు, రాయన్న పేట మీదుగా వంగవీడు వరకు రహదారి విస్తరణ. మొత్తంగా 15.72 కిలోమీటర్ల మేర రహదారికి విస్తరణకు రూ.94.32 కోట్ల నిధుల మంజూరు అయ్యాయి.