UPI Payments : యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పులు.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు బ్యాంకుల కొత్త ప్రతిపాదన..!
UPI Payments : యూపీఐ ద్వారా డబ్బు పంపేవారికి త్వరలో కొత్త భద్రతా ఫీచర్ వచ్చే అవకాశం ఉంది. అనుమానాస్పద లావాదేవీలకు 'Yes లేదా No' అలర్ట్, రూ.10 వేలకుపైగా ట్రాన్సాక్షన్లపై కొత్త ప్రతిపాదనల పూర్తి వివరాలు తెలుసుకోండి.
భారత్లో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూపీఐ (UPI) ఇప్పుడు ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో భాగమైంది. టీ దుకాణంలో రూ.20 చెల్లింపు నుంచి లక్షల రూపాయల లావాదేవీల వరకు కోట్లాది మంది యూపీఐనే వినియోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్ ఉన్న దాదాపు ప్రతి ఒక్కరి మొబైల్లో కనీసం ఒక యూపీఐ యాప్ తప్పనిసరిగా కనిపిస్తోంది. రోజురోజుకూ యూపీఐ లావాదేవీల సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తుండగా, అదే స్థాయిలో సైబర్ మోసాలూ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కు కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అనుమానాస్పద లేదా అధిక రిస్క్గా గుర్తించే యూపీఐ లావాదేవీల విషయంలో వినియోగదారులకు అదనపు భద్రత కల్పించే కొత్త విధానాన్ని అమలు చేయాలని సూచించాయి.
UPI Payments : యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పులు.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు బ్యాంకుల కొత్త ప్రతిపాదన..!
హై రిస్క్ UPI ట్రాన్సాక్షన్లకు ‘Yes లేదా No’ అలర్ట్?
బ్యాంకులు చేసిన ప్రతిపాదన ప్రకారం, అనుమానాస్పదంగా గుర్తించిన యూపీఐ చెల్లింపులు చేసే ముందు వినియోగదారుడి మొబైల్ స్క్రీన్పై ప్రత్యేక పాప్-అప్ అలర్ట్ కనిపించే అవకాశం ఉంది. అందులో “Yes” లేదా “No” అనే రెండు ఎంపికలు ఉంటాయి. వినియోగదారుడు “Yes” ఎంపిక చేస్తే లావాదేవీ వెంటనే ప్రాసెస్ అవుతుంది. “No” ఎంపిక చేస్తే ట్రాన్సాక్షన్ రద్దవుతుంది. ఒకవేళ ఈ రెండు ఎంపికల్లో ఏదీ ఎంచుకోకపోతే, ప్రతిపాదన ప్రకారం డబ్బు బదిలీ గంటలోపు పూర్తయ్యే విధంగా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ఈ అలర్ట్ విధానం ద్వారా వినియోగదారుడు డబ్బు సరైన వ్యక్తికే పంపుతున్నాడా? ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయా? అనే విషయాలను మరోసారి ధృవీకరించుకునే అవకాశం ఉంటుంది. తొందరపాటులో తప్పు వ్యక్తికి డబ్బు పంపే ప్రమాదాన్ని ఇది కొంతవరకు తగ్గించగలదని బ్యాంకులు భావిస్తున్నాయి.
ఏ లావాదేవీలకు మాత్రమే ఈ భద్రతా ప్రాంప్ట్ కనిపిస్తుంది?
ఈ ప్రతిపాదన ప్రకారం ప్రతి యూపీఐ చెల్లింపుకూ ఈ అలర్ట్ కనిపించదు. అసాధారణంగా లేదా అధిక ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన లావాదేవీలకు మాత్రమే ఈ భద్రతా ప్రాంప్ట్ చూపించాలని బ్యాంకులు సూచించాయి.
అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా…
. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జరిగే చెల్లింపులు,
. వినియోగదారుడు ఇంతకుముందు ఎప్పుడూ డబ్బు పంపని కొత్త వ్యక్తికి చేసే ట్రాన్సాక్షన్లు,
. కొత్తగా ప్రారంభించిన బ్యాంకు ఖాతాలకు జరిగే చెల్లింపులు,
. సైబర్ మోసాల్లో తరచూ ఉపయోగించే అనుమానాస్పద ఖాతాలకు జరిగే లావాదేవీలు,
వంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ అదనపు హెచ్చరిక కనిపించేలా ప్రతిపాదించారు.
ఇదే సమయంలో యూపీఐ ద్వారా రూ.10 వేలకుపైగా పంపే లావాదేవీలపై కూడా గతంలో చర్చకు వచ్చిన మరో ప్రతిపాదన ఉంది. అలాంటి చెల్లింపులకు ఒక గంట వెయిటింగ్ పీరియడ్ అమలు చేయాలని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే రూ.10 వేలకుపైగా పంపిన మొత్తం వెంటనే గ్రహీత ఖాతాలో జమ కాకుండా, గంట తర్వాత జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మధ్యలో వినియోగదారుడు అవసరమైతే ట్రాన్సాక్షన్ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అనేక బ్యాంకులు దీనికి ప్రత్యామ్నాయంగా “Yes / No” ధృవీకరణ విధానాన్నే మెరుగైన పరిష్కారంగా సూచిస్తున్నాయి. అలాగే రూ.10 వేల పరిమితిని మించిన ప్రతి లావాదేవీకి ఈ ప్రాంప్ట్ చూపించాలని బ్యాంకులు సూచించడం లేదు. కేవలం అసాధారణ ప్రవర్తన కనిపించే, అధిక రిస్క్ ఉన్న ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఈ అదనపు భద్రతా వ్యవస్థ అమలు చేయాలని ప్రతిపాదించాయి. ప్రస్తుతం ఇవి బ్యాంకులు చేసిన ప్రతిపాదనలు మాత్రమే. ఈ మార్పులపై ఆర్బీఐ, ఎన్పీసీఐ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.







