Konda Surekha : కాంగ్రెస్కు గుడ్బై చెప్పనున్న కొండా సురేఖ? ఆ పార్టీవైపు అడుగులు..?
Konda Surekha కొండా సురేఖ రాజకీయ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సురేఖ స్పష్టం
Konda Surekha : కొండా సురేఖ రాజకీయ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సురేఖ స్పష్టం చేసినప్పటికీ.. గతంలో మాదిరిగా పార్టీలో చురుకుగా కొనసాగేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని కొండా దంపతులు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఆమె కీలక మంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి రాజకీయంగా ఆహ్వానాలు వస్తున్న నేపథ్యంలో.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కీలక మద్దతుదారులు, అనుచరులతో కొండా సురేఖ అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రచారం సాగుతోంది. దీంతో సురేఖ తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Konda Surekha : కాంగ్రెస్కు గుడ్బై చెప్పనున్న కొండా సురేఖ? ఆ పార్టీవైపు అడుగులు..?
Konda Surekha కాంగ్రెస్లోనే కొనసాగుతానన్న సురేఖ.. కానీ పరిస్థితులు మారాయా?
కొండా సురేఖ రాజకీయంగా ఎటువైపు వెళ్తారన్న ప్రశ్న ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మంత్రి పదవి నుంచి తొలగించిన సమయంలో తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని, పార్టీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆమె ఎంతకాలం కాంగ్రెస్లో కొనసాగుతారనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా కొండా సురేఖ వ్యవహారం రాజకీయంగా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు ఆమెతో టచ్లోకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కొండా దంపతులు తమ రాజకీయ భవిష్యత్తుతో పాటు తమ కుమార్తె సుస్మిత రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుస్మిత బీజేపీలో చేరేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ పార్టీ నేతల నుంచి ఇప్పటికే సానుకూల సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొండా దంపతులు కూడా బీజేపీలో చేరే అంశంపై ఆ పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన ఉన్నప్పటికీ.. కొన్ని సూచనలు, షరతులతో కూడిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొండా దంపతులు బీజేపీలో చేరితే రాష్ట్ర స్థాయిలో కాకుండా నేరుగా ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానం సమక్షంలో పార్టీలో చేరాలని కోరుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో సురేఖ రాజకీయ అడుగులు ఏ దిశగా పడబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ మరింత పెరిగింది.
బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు.. బీఆర్ఎస్లోకి మాత్రం నో ఛాన్స్?
కొండా దంపతులు బీజేపీలో చేరే అంశంపై తెలంగాణ బీజేపీ నేతలు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలువురు ఎంపీలు కూడా కొండా సురేఖ తమ పార్టీలోకి వస్తే తమకు అభ్యంతరం లేదనే విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక కొండా సురేఖ తిరిగి బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశాలు మాత్రం దాదాపుగా లేవనే చర్చ జరుగుతోంది. ఆమెను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ముఖ్య నేత జగదీష్ రెడ్డి ఇప్పటికే కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. అంతేకాదు, సురేఖకు తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా సంచలనంగా మారాయి.
మరోవైపు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన అంశంపై బీజేపీ నేతలు డీకే అరుణ, రాంచందర్ రావు స్పందించారు. ఒక బీసీ మహిళా మంత్రిని ఈ విధంగా పదవి నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదని వారు వ్యాఖ్యానించారు.అయితే కొండా దంపతులు ఇప్పటివరకు నేరుగా తమను సంప్రదించలేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. వారు బీజేపీలో చేరాలని నిర్ణయించుకుంటే.. ఆ అంశంపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే కొండా సురేఖ తదుపరి రాజకీయ అడుగులు బీజేపీ వైపే పడే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ను వీడే విషయంలో ఆమె నుంచి అధికారికంగా ఎలాంటి తుది ప్రకటన రాకపోవడంతో.. చివరకు కొండా కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న మంత్రాంగం, మద్దతుదారుల అభిప్రాయ సేకరణ, బీజేపీ నేతల సానుకూల వ్యాఖ్యలు, బీఆర్ఎస్ నుంచి వస్తున్న స్పష్టమైన వ్యతిరేకత.. ఇవన్నీ కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.







