Trainee IPS Officer : పెద్ద ఆటగాడే .. ఉదయ కృష్ణా రెడ్డి కేసులో కొత్త అమ్మాయి దొరికింది..!
Trainee IPS Officer : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సోదాల్లో ప్రేమలేఖలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరో మహిళతో సంబంధాల కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) కి చెందిన ఈ వ్యవహారం సస్పెన్షన్, అరెస్టు, రిమాండ్ వరకు వెళ్లడంతో దేశవ్యాప్తంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫిర్యాదులో తనపై లైంగిక దాడి, వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Trainee IPS Officer : పెద్ద ఆటగాడే .. ఉదయ కృష్ణా రెడ్డి కేసులో కొత్త అమ్మాయి దొరికింది..!
అశోక్నగర్ గదిలో సోదాలు.. ప్రేమలేఖలు, ల్యాప్టాప్, ఫోన్ స్వాధీనం
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అశోక్నగర్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ల్యాప్టాప్, సెల్ఫోన్తో పాటు ఇద్దరు వ్యక్తుల చేతిరాతలో ఉన్నట్లు చెప్పబడుతున్న రెండు ప్రేమలేఖలను, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రేమలేఖల్లో ఉన్న పేర్ల ఆధారంగా పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మహిళతో సన్నిహిత పరిచయం ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. దర్యాప్తు వివరాల ప్రకారం, ఆ మహిళకు 2014లో వివాహం జరిగింది. అయితే 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా తన కుమారుడితో కలిసి నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు సమాచారం. హైదరాబాద్కు వచ్చిన అనంతరం ఆమె కొంతకాలం ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసినట్లు, ఈ ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సూచన మేరకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. అనంతరం అశోక్నగర్లోని ఒక ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగంలో చేరినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సమాచారం ప్రకారం, ఆమెను లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండాలని ఉదయ్ కృష్ణారెడ్డి కోరినట్లు, అయితే చట్టపరంగా విడాకులు ఇంకా పూర్తికాకపోవడంతో ఆమె అందుకు అంగీకరించలేదని విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ట్రైనీ మహిళా ఐపీఎస్తో భేటీ తర్వాత బయటపడిన అంశాలు
ఈ కేసు దర్యాప్తులో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అశోక్నగర్లో నివసిస్తున్న ఆ మహిళను ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి కలిసినట్లు సమాచారం. ఆ భేటీ సందర్భంగా తాను కూడా ఉదయ్ కృష్ణారెడ్డితో సన్నిహితంగా ఉన్నానని, తనపై కూడా దాడులు, వేధింపులు జరుగుతున్నాయని మహిళా ట్రైనీ ఐపీఎస్ తన ఆవేదనను పంచుకున్నట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆ మహిళ నిందితుడికి దూరంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ఆధారాలను కూడా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయ్యే వరకు కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఆరోపణలపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఆరోపణలు నిర్ధారణ కాలేదని గమనించాలి.







