Brahmamudi 2026 February 17th Episode: అప్పు, కళ్యాణ్ జాడ కోసం రాజ్, కావ్య తీవ్ర ప్రయత్నాలు.. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న అప్పు, కళ్యాణ్.. రుద్రాణి వార్నింగ్..!
Brahmamudi 2026 February 17th Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ ‘బ్రహ్మముడి’ Brahmamudi రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠగా సాగుతోంది. ఫిబ్రవరి 17వ తేదీన ప్రసారమైన 958వ ఎపిసోడ్ లో హైడ్రామా చోటుచేసుకుంది. అప్పు, కళ్యాణ్ లను వెతికే క్రమంలో రాజ్, కావ్యలకు ఎదురైన సవాళ్లు, రుద్రాణి కుట్రలు ఈరోజు ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచాయి.

Brahmamudi 2026 February 17th Episode: అప్పు, కళ్యాణ్ జాడ కోసం రాజ్, కావ్య తీవ్ర ప్రయత్నాలు.. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న అప్పు, కళ్యాణ్.. రుద్రాణి వార్నింగ్..!
Brahmamudi 2026 February 17th Episode : సుభాష్ పై ప్రకాశం రివర్స్
ఎపిసోడ్ ఆరంభంలో ఇంట్లో గొడవ జరుగుతుంది. రాజ్, కావ్య రేవతి ఇంట్లో ఉండటంపై ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. “వాళ్లు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ నా కొడుకు కోడలు ఏమయ్యారో అని నేను ఏడుస్తున్నాను” అని అపర్ణతో గొడవకు దిగుతుంది. ఇది చూసిన సుభాష్.. “పిల్లల మనసు తెలుసుకుని మాట్లాడు. ఇంటికి మూలస్తంభాలైన రాజ్, కావ్యలను అలా అనడం అవివేకం” అని మందలిస్తాడు. అయితే, అనూహ్యంగా ప్రకాశం తన అన్నయ్య సుభాష్ పైనే రివర్స్ అవుతాడు. “పిల్లలు దూరమైన బాధలో ఉంది, ఆమాత్రం అనలేదా? నువ్వెందుకు ఆమెపై అరుస్తున్నావ్” అని భార్యకు సపోర్ట్ గా నిలుస్తాడు.
Brahmamudi 2026 February 17th Episode : రుద్రాణి విందు.. రాహుల్ వినోదం
మరోవైపు తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని రుద్రాణి, రాహుల్, రేఖ ఫుల్ ఖుషీలో ఉంటారు. మందు తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. “ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. అప్పు-కళ్యాణ్ కిడ్నాప్ తో ట్రస్ట్ ఆగిపోయింది, ఆ నింద రాజ్-కావ్యల మీద పడింది” అని రాహుల్ తల్లిని పొగుడుతాడు. “ఇది ఆరంభం మాత్రమే.. నేను ఆ మినిస్టర్ ద్వారా మళ్లీ ఈ ఇంట్లో మహారాణిలా అడుగుపెడతాను. అప్పటివరకు ఈ ఇంటి మనుషులను మీ మాటలతో కృంగదీయండి” అని రుద్రాణి తన కొడుకుకి, రేఖకు దిశా నిర్దేశం చేస్తుంది.
స్వప్న పాపకు జ్వరం.. రాహుల్ డ్రామా
ఇక స్వప్న తన కూతురుకు జ్వరం తగ్గకపోవడంతో కంగారు పడుతుంది. డాక్టర్ కు ఫోన్ చేయగా, వెంటనే హాస్పిటల్ కు తీసుకురమ్మని చెబుతుంది. ఇదే విషయాన్ని రాహుల్ కు ఫోన్ చేసి చెప్పగా.. “నాకు ఆఫీస్ లో అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లు” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడు. అయితే, రుద్రాణి ముందు మాత్రం “మంచివాడిగా నటించడం చాలా కష్టంగా ఉంది” అని రాహుల్ అంటాడు. చివరకు సుభాష్ సాయంతో స్వప్న హాస్పిటల్ కు వెళ్తుంది. అక్కడికి రాజ్, కావ్య కూడా వచ్చి ఆమెకు ధైర్యం చెబుతారు.
రాజ్ కు దొరికిన క్లూ.. రుద్రాణి మాస్టర్ ప్లాన్
పోలీసులు అప్పు-కళ్యాణ్ ల లోకేషన్ ట్రేస్ చేశామని రాజ్ కు చెబుతారు. ఆ ఆశతో రాజ్, కావ్య ఆ అడ్రస్ కు వెళ్తారు. అక్కడ ఒక పాడుబడిన ఇల్లు ఉంటుంది కానీ అందులో ఎవరూ ఉండరు. అయితే అక్కడ ఒక ఫోన్ దొరుకుతుంది. “ఇది కిడ్నాపర్ ఫోన్ అయ్యి ఉంటుంది, వాళ్లు ప్లేస్ మార్చి ఉంటారు” అని ఎస్సై అంటాడు. కానీ ఇదంతా రుద్రాణి ప్లాన్ అని ఎవరికీ తెలియదు. “మీరు వెళ్లిన ప్రతి చోట క్లూ దొరుకుతుంది, కానీ మనుషులు దొరకరు. నేనే కావాలని ఆ క్లూస్ వదిలాను” అని రుద్రాణి తనలో తానే నవ్వుకుంటుంది.
అప్పు, కళ్యాణ్ మిస్సింగ్.. రుద్రాణి మర్డర్ ప్లాన్?
ట్విస్ట్ ఏంటంటే.. కిడ్నాపర్ల నుంచి అప్పు, కళ్యాణ్ తప్పించుకుంటారు. ఈ విషయం రౌడీలు రుద్రాణికి ఫోన్ చేసి చెబుతారు. దీంతో రుద్రాణికి కోపం కట్టలు తెంచుకుంటుంది. “వాళ్లు తప్పించుకుంటే నా గుట్టు రట్టవుతుంది. వాళ్లు దొరకగానే చంపేయండి” అని ఆర్డర్ వేస్తుంది. చివరలో అప్పును ఒక రౌడీ కత్తితో పొడిచినట్లుగా చూపించి ఎపిసోడ్ ను ఉత్కంఠభరితంగా ముగించారు.
మరి అప్పు, కళ్యాణ్ ప్రాణాలతో బయటపడతారా? రుద్రాణి కుట్రను రాజ్, కావ్య ఛేదించగలరా? అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.