YS Sharmila : జగనన్న దేనికి ‘ సిద్ధం ‘ చెప్పు.. మరోసారి రెచ్చిపోయిన వైయస్ షర్మిల ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : జగనన్న దేనికి ‘ సిద్ధం ‘ చెప్పు.. మరోసారి రెచ్చిపోయిన వైయస్ షర్మిల ..!

YS Sharmila : కొద్ది రోజులుగా యాత్రలకు విరామం ఇచ్చిన వైయస్ షర్మిల బుధవారం నుంచి రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. బాపట్లలో నిర్వహించిన రోడ్ షోకు ఊహించిన విధంగా జనం తరలివచ్చారు.వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. జగనన్న అంటూనే ఆయనపై కోపాన్ని దాచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నా ఎప్పుడు ప్రజల మధ్యకు రారని వైఎస్ జగన్ ను ఎద్దేవా చేశారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 February 2024,7:00 pm

YS Sharmila : కొద్ది రోజులుగా యాత్రలకు విరామం ఇచ్చిన వైయస్ షర్మిల బుధవారం నుంచి రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. బాపట్లలో నిర్వహించిన రోడ్ షోకు ఊహించిన విధంగా జనం తరలివచ్చారు.వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. జగనన్న అంటూనే ఆయనపై కోపాన్ని దాచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నా ఎప్పుడు ప్రజల మధ్యకు రారని వైఎస్ జగన్ ను ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చాయని ‘ సిద్ధం ‘ అంటూ బయటికి వచ్చారని, దేనికి సిద్ధం జగన్ సార్ అని నిలదీశారు. మళ్లీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా అని విమర్శించారు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని, ఏమీ చేయలేమని అంటున్నారని, రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని ఎందుకు ఇన్నాళ్లు అడగలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోదా రాదని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి ఓటు వేసినా, వైయస్ జగన్ కి ఓటు వేసినా, పవన్ కళ్యాణ్ కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని అన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా బీజేపీ రాజ్యమేలుతుందని, హోదా రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. అధికారంలో వచ్చిన మొదటి రోజే హోదాపై సంతకం పెడతానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తలెత్తుకునే రాజధాని రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. పోలవరం పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. వైయస్సార్ గుర్తుతో గెలిచారని, గెలిచాక వైయస్సార్ ఆశయాలను మరిచారని, కనీసం వైయస్సార్ విగ్రహాన్ని కూడా పెట్టనివ్వడం లేదని ఆరోపించారు.

వైఎస్ జగన్ పాలనలో అంతా మోసమే అని, అన్ని వర్గాలకు మోసమే అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదని, జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఐదేళ్లలో పూర్తిగా మధ్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చారని, ఐదేళ్ల తర్వాత మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నాడని, ఇప్పుడు ఉందా మద్యపాన నిషేధమని ప్రశ్నించారు. పదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. ఈ పదేళ్లలో పార్టీలు కనీసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని అన్నారు. ఇక ఈ రోడ్ షోలో వైయస్ షర్మిల తో పాటు సీనియర్లు కేవీపీ, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, కొప్పల రాజు వంటి వారు పాల్గొన్నారు. ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన స్థితిలో ఉన్న కాంగ్రెస్ కు పునర్జీవం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు వైయస్ షర్మిల.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది