Navratri : నవరాత్రులల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో మీకు తెలుసా ?

Authored By Devotional Desk | The Telugu News | Updated on : 10 October 2021, 6:00 am

నవరాత్రులు.. శక్తి స్వరూపిణి ఆరాధనకు అత్యంత అనువైన కాలంగా శాస్త్రం పేర్కొంది. ప్రశాంతమైన శరత్‌కాలం ప్రారంభంలో అమ్మ అనుగ్రహం కోసంచేసే ఆరాధన అత్యంత పవిత్రమైనది, శక్తివంతమైనది. అయితే ఈ నవరాత్రులలలో ఎవరి శక్తిమేరకు వారు అమ్మను పూజించవచ్చు. శ్రీవిద్యా ఉపాసన, అమ్మవారి స్తోత్రాలు, కవచాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలతో ఆరాధన చేయడం ప్రధానం. దీనితోపాటు ఆయా రోజుల్లోఅమ్మవారికి సమర్పించే నైవేద్యాలు, అయా రోజుల్లో ఆయా రూపాలలో అమ్మ అలంకరణ, ఆరాధన చాలా ముఖ్యం. వీటితోపాటు తొమ్మిది రోజులు అమ్మవారిని ఆయా రంగులతో, ఆయా రంగుల దుస్తులను వేసుకుని ప్రార్థన చేయడం, పూజించడం చేస్తే శ్రీఘ్రంగా అమ్మ అనుగ్రహం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి, అమ్మవారికి సమర్పించాలో తెలుసుకుందాం…

kanaka durga navratri 2021

kanaka durga navratri 2021

మొదటి రోజు- పసుపు రంగు : నవరాత్రుల్లో మొదటిరోజు శైలపుత్రిగా కొలుస్తారు. ప్రకృతి శక్తికి ప్రతిరూపమైన శైలపుత్రి అందరికీ సంతోషాన్ని, ఉల్లాసాన్ని అందిస్తుంది. అమ్మవారిని పచ్చని పూలతో అర్చించడమే కాదు, ఆ రోజు పసుపు రంగు వస్ర్తాలూ ధరించాలని చెబుతారు.రెండో రోజు- ఆకుపచ్చ రంగు : దుర్గ్గాదేవి రెండో రోజు అవతారం బ్రహ్మచారిణి. ప్రకృతి మాతగా భావించే బ్రహ్మచారిణికి ఇష్టమైన వర్ణం హరితం. ప్రసన్న వదనంతో దర్శనమిచ్చే తల్లి భక్తుల కష్టాలను దూరం చేస్తుంది. రెండో రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. మూడో రోజు-బూడిద రంగు : మూడోరోజు అమ్మవారు చంద్రఘంటగా అరాధన చేస్తారు. ధర్మ పరిరక్షణ కోసం దశ హస్తాలతో ఆవిర్భవించి, దుష్టులను రూపు
మాపింది చంద్రఘంట. ఆ తల్లి శక్తికి ప్రతీకగా మూడోనాడు బూడిద రంగు దుస్తులు వేసుకోవాలి.

నాలుగో రోజు -నారింజ రంగు : చతుర్థి రోజున దుర్గాదేవి కూష్మాండ అవతారంలో దర్శనమిస్తుంది. దేదీప్యమానంగా వెలిగిపోయే ఆ తల్లి విశ్వంలోని చీకటినంతా పారదోలిందట. అగ్నిని పోలిన నారింజ రంగు అంటే అమ్మవారికి ఇష్టం. చతుర్థి రోజు నారింజ రంగు దుస్తులు ధరించడం మేలు.

ఐదో రోజు-తెలుపు రంగు : దుర్గామాతను ఆరో రోజు స్కందమాతగా పూజిస్తారు. సింహవాహనంపై స్వారీ చేస్తూ, తన ఒడిలో కార్తికేయుణ్ని పెట్టుకొని బిడ్డలను అనుగ్రహిస్తుంది. తల్లి ప్రేమ కంటే మించిన రక్ష ఈ విశ్వంలోనే లేదు. తల్లి ప్రేమకు, స్వచ్ఛతకు ప్రతీకగా తెలుపు రంగు దుస్తులు ధరించాలి.

ఆరో రోజు-ఎరుపు రంగు : ఆరోరోజు అమ్మవారు కాత్యాయనిగా కనువిందు చేస్తుంది. అసురులను సంహరిస్తూ ఉగ్రమూర్తిగా చెలరేగిపోతున్న తల్లి ఆవేశానికి ప్రతీకగా ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.

ఏడో రోజు – నీలం రంగు : జగన్మాత కాళరాత్రిగా అవతరించిన ఏడో రోజుకు ఎన్నో ప్రత్యేకతలు. నిశిరాత్రి వేళ.. గార్ధ్దభ వాహనంపై భయానక రూపంతో వచ్చి రాక్షసులను సంహరించింది కాళరాత్రి. నీలం రంగు రాత్రికి సూచన. అపారమైన శక్తికి ప్రతీక. నీలం రంగు దుస్తులు ధరించాలి.

ఎనిమిదో రోజు- గులాబి రంగు : దుర్గాష్టమి రోజు గౌరీదేవిగా కొలుస్తారు. ప్రేమకు ప్రతీకగా దర్శనమిచ్చే తల్లి భక్తులను నిండు మనసుతో ఆశీర్వదిస్తుంది. కాబట్టే, గులాబి రంగు దుస్తులు ధరిస్తారు భక్తులు.

తొమ్మిదో రోజు -ఊదా రంగు : తొమ్మిదో రోజు… మహర్నవమి నాడు అమ్మవారు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది. భక్తుల కోరికలను తీర్చేందుకు ఆమె సిద్ధంగా ఉంటుంది. ఈరోజు ఊదారంగు బట్టలు వేసుకుంటే సిద్ధిధాత్రి అనుగ్రహం లభిస్తుంది.

పదోరోజు విజయదశమి : మీకు ఇష్టం వచ్చిన రంగు దుస్తులు ధరించండి. అమ్మవారిని ఆరాధించండి. విజయ మూహూర్తంలో మీపనులను ప్రారంభించి ఏడాదంతా విజయ పరంపరతో ముందుకు పోండి. శ్రీమాత్రేనమః

Advertisement

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి