Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం పూజా విధానం… పాటించాల్సిన నియమాలు
Varalakshmi Vratam : హిందువులు శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతం గా జరుపుకుంటారు. భక్తితో వేడుకుంటే వరాలనిచ్చే తల్లి వరలక్ష్మి దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వలన లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వరా అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. శ్రావణమాసంలో పౌర్ణమి వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారంలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతం పాపాలు తొలగి లక్ష్మీప్రసన్నత కలుగుతుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రతాన్ని సుమంగళీ స్త్రీలు ఆచరించాలి. ఆ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పూజా మందిరంలో ఒక్క మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకొని అమ్మవారి రూపాన్ని తయారు చేసి అమర్చుకోవాలి. పూజ సామాగ్రి, తోరాలు, అక్షతలు పసుపు, గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడలతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజను ప్రారంభించాలి.
ముందుగా గణపతి పూజ చేయాలి. వినాయకునికి నమస్కరిస్తూ పూజ చేసి అక్షతలు తల మీద వేసుకోవాలి. గణపతిని పూజించిన తర్వాత వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై పూజా ద్రవ్యాలపై పూజ చేస్తున్నవారు తల పైన చల్లుకోవాలి. లక్ష్మీ అష్టోత్తర నామాలను చదువుతూ తోరాన్ని అమ్మవారి వద్ద నుంచి అక్షింతలతో పూజలు చేయాలి. తర్వాత లక్ష్మీదేవి కథ విని అక్షితలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తయిదులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరలక్ష్మీదేవి కనుకరిస్తుంది. అయితే శ్రావణమాసం మొదలుకావడమే జులై 29న శుక్రవారం తో మొదలైంది. కనుక ఆగస్టు 5న చేసుకోవాలా లేక ఆగస్టు 12న చేసుకోవాలని సందిగ్ధంలో ఉన్నారు. అయితే మహిళలు వారి అత్తవారింటి పురోహితుడిని అడిగి సాంప్రదాయ ప్రకారం చేసుకుంటే మంచిదని పురోహితులు చెబుతున్నారు.