Venkaiah Naidu : కులం ఉండొచ్చు.. కులపిచ్చి ఉండకూడదు : కోదాడలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..!
ప్రధానాంశాలు:
Venkaiah Naidu : కులం ఉండొచ్చు.. కులపిచ్చి ఉండకూడదు : కోదాడలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..!
Venkaiah Naidu : మంచి కోసం, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులే సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సేవా భావంతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కరూ అభినందనీయులేనని ఆయన అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ వై జంక్షన్ సమీపంలో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన వెంకయ్య నాయుడు, భారతీయ సంస్కృతిలో “సర్వేజనాః సుఖినో భవంతు” అనే భావన ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సమాజం మొత్తం ఒకే కుటుంబంలా భావించి పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ సంపదకు కేవలం యజమానులు మాత్రమే కాకుండా ధర్మకర్తలుగా వ్యవహరించాలని అన్నారు.ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే సేవే నిజమైన ధర్మమని ఆయన స్పష్టం చేశారు. ఇష్టపడి, కష్టపడి పనిచేసే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ నష్టపోడని పేర్కొన్నారు. తనదైన శైలిలో యతి ప్రాసలతో ప్రసంగిస్తూ సభికులను ఆకట్టుకున్నారు.
Venkaiah Naidu : కులం ఉండొచ్చు.. కులపిచ్చి ఉండకూడదు: కోదాడలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..!
Venkaiah Naidu ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది
ప్రకృతి, సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేకంగా ప్రస్తావించిన వెంకయ్య నాయుడు, “Nature and Culture for a Bright Future” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు. ప్రస్తుతం ప్రకృతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. చెట్లు, జంతువులు ఇతరుల కోసం జీవిస్తాయని, మనుషులు కూడా సేవా భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.”ఆవు, చెట్టు పరులకు ఉపకారం కోసం జీవిస్తాయి. మనిషి కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలి” అని ఆయన అన్నారు. ప్రకృతిని ప్రేమించి, పరిరక్షించడం ద్వారా భావితరాలకు మంచి భవిష్యత్తు అందించవచ్చని పేర్కొన్నారు.
Venkaiah Naidu కులం ఉండొచ్చు.. కానీ కులపిచ్చి ఉండకూడదు
సమాజంలో ఐక్యత అవసరాన్ని ప్రస్తావించిన మాజీ ఉపరాష్ట్రపతి, కులం అనేది సహజమైనదే అయినప్పటికీ కులపిచ్చి సమాజానికి హానికరమని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను మొదట న్యాయవాదిగా మారాలని భావించానని, అయితే దేశంలో అత్యవసర పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని గుర్తుచేశారు. తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, బాల్య జీవితంలోని కొన్ని సంఘటనలను సభికులతో పంచుకున్నారు.రాజకీయ నాయకులు ఎక్కువగా మాట్లాడటం కంటే ఎక్కువగా పనిచేయాలని ఆయన సూచించారు. సమాజాభివృద్ధి కోసం పనిచేస్తున్న సేవా సంస్థలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ప్రశంసనీయమని అన్నారు.
Venkaiah Naidu ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు
కళ్యాణ మండప నిర్మాణానికి సహకరించిన దాతలను వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు.అలాగే కాకతీయ కమ్మ సేవా సమితి బాధ్యులు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, దాతలు, సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు.







