Uma Maheshwari : స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణం.! అసలు కారణమేంటి.?
Uma Maheshwari : విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుకి మొత్తం పన్నెండు మంది సంతానం. అందులో నలుగురు కుమార్తెలు. ఆ నలుగురిలో చిన్నవారైన ఉమామహేశ్వరి నేడు మృతి చెందారు. తొలుత ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారనే వార్తలు వచ్చయి. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా ధృవీకరించబడింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉమామహేశ్వరి బాధపడుతున్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అనారోగ్యానికి తోడు తీవ్ర మానసిక ఒత్తిడికి ఆమె లోనయ్యారంటూ ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పేర్కొన్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారనీ, రెండు గంటలైనా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం పంపామని తెలిపారు దీక్షిత. అయితే, ఆత్మహత్య చేసుకునేంత బలమైన సమస్య ఆమెకు ఏం వచ్చి పడింది.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనారోగ్యమే ఆమె మానసిక ఒత్తిడికి గురవడానికి కారణమన్న వాదన ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఎప్పుడూ నవ్వుతూ వుండే ఉమామహేశ్వరి ఇలా బలవన్మరణానికి పాల్పడటాన్ని ఎన్టీయార్ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యుల్ని ఉదార్చుతున్నారు. సోదరి మరణాన్ని బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారు. ఆత్మహత్య కావడంతో, పోస్టుమార్టం వంటి వ్యవహారాల్ని బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నారట. ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు కొందరు విదేశాల్లో వుండడంతో, వారి రాక నిమిత్తం అంత్యక్రియల్ని ఎల్లుండి వరకూ చేసే అవకాశం వుంది. కుటంబ పరమైన సమస్యలు ఏమైనా వున్నాయా.? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.