Kadiyam Srihari : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటా.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

 Authored By kranthi | The Telugu News | Updated on :27 October 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు చేస్తున్నారా?

  •  కాంగ్రెస్ నేతలను కడియం సవాల్

  •  దమ్ముంటే నిరూపించండి.. నేను ఎన్నికల్లో పోటీ చేయను

Kadiyam Srihari : కడియం శ్రీహరి గురించి తెలుసు కదా. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది ఆయనకు. టీడీపీ హయంలో మంత్రిగానూ కడియం పనిచేశారు. వరంగల్ జిల్లాలో కీలక రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. స్టేషన్ ఘనపూర్ లో ప్రస్తుతం తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ.. ఈసారి రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా కడియం శ్రీహరి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ప్రచారంలో భాగంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయని నిరూపిస్తే తాను త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు.

కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ నాయకులు మాటలు తుపాకీ రాముడికి ఎక్కువగా, ఉత్తర కుమారుడికి తక్కువగా ఉన్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. ప్రజలతో చీ కొట్టించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి.. వాళ్ల నియోజకవర్గ ప్రజలతో చీత్కారానికి గురయిన వాళ్లు సీఎం కేసీఆర్ కు సవాల్ చేసే ధైర్యం ఉందా? అంత దమ్ము వీళ్లకు ఉందా? అసలు వాళ్లకు ఆ అర్హత లేదని కడియం శ్రీహరి మండిపడ్డారు. కేఏ పాల్ కు, వాళ్లకు ఏం తేడా లేదు. కాంగ్రెస్ నాయకులు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మంచి చేస్తున్నారో.. చెడు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, హస్తం పార్టీ విజయం సాధిస్తే.. అధికారం చేపడితే తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతుందన్నారు.

Kadiyam Srihari : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు హామీలు అమలు కావడం లేదు

తెలంగాణలో ఎన్నికలు వచ్చాయని ఇష్టం ఉన్నట్టుగా హామీలను గుప్పిస్తున్నారు. అసలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు. అక్కడి హామీలు ఇచ్చి అవి అమలు చేయకుండా.. ఇప్పుడు తెలంగాణలో కూడా గొప్పలకు పోయి ఇష్టం ఉన్నట్టుగా హామీలను ఇస్తున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి