Warangal Airport : వరంగల్ ఎయిర్ పోర్టు క్రిడెట్ ఏ పార్టీకి దక్కుతుంది..?
ప్రధానాంశాలు:
Warangal Airport : వరంగల్ ఎయిర్ పోర్టు క్రిడెట్ ఏ పార్టీకి దక్కుతుంది..?
Warangal Airport : వరంగల్లో మామనూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ గేమ్ మొదలైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఈ ఎయిర్ పోర్టును కొచ్చి ఎయిర్ పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీని ద్వారా తెలంగాణలో విమానయాన సేవలు మరింత విస్తరించనున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎవరి కృషి ఎక్కువ? ఎవరికి ఘనత దక్కాలి? అనే విషయంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో మాటల యుద్ధం మొదలుపెట్టాయి.

Warangal Airport : వరంగల్ ఎయిర్ పోర్టు క్రిడెట్ ఏ పార్టీకి దక్కుతుంది..?
కేంద్రం అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు మామనూరు ఎయిర్ స్ట్రిప్ వద్ద సంబరాలు చేసుకున్నారు. దీంతో ఒకరిదంటే ఒకరికి ఘనత తీసిపోకుండా పోటీ పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తానే ఎంతో కష్టపడి కేంద్రమంత్రులను ఒప్పించి, భూసేకరణ నిధులు కేటాయించి, ఎయిర్ పోర్టును తెచ్చానని ప్రకటించారు. అయితే బీజేపీ నేత కిషన్ రెడ్డి దీనిని తిప్పికొడుతూ, ఈ ప్రాజెక్ట్ పూర్తిగా తమ కృషి వల్లే సాధ్యమైందని ప్రచారం మొదలుపెట్టారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేతలు “ఏదైనా అభివృద్ధి జరిగితే అది కిషన్ రెడ్డి కృషి, లేదంటే రేవంత్ వైఫల్యమే” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ నేతలు మరో వాదనను ముందుకు తెస్తున్నారు. తామే మొదట వరంగల్ ఎయిర్ పోర్టు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చామని, అనుమతుల కోసం ఎంతగానో కృషి చేశామని చెప్పుకొస్తున్నారు. అయితే గతంలోనే కేంద్రం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణలో సహకరించలేదని మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వాదనలతో బీఆర్ఎస్ మౌనం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం స్థానిక ప్రజల చిరకాల స్వప్నం. రాజకీయ పార్టీలు ఎవరి కృషి ఎక్కువ అనే విషయంపై వాదనలు చేయడం కంటే, ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికార, విపక్ష పార్టీలు పరస్పర విమర్శలకు కాకుండా, నిర్మాణ పనుల కోసం కలిసి పనిచేయడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.