Tholi Ekadashi : తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఎలా ఆరాధించాలి ?

Authored By Anusha V | The Telugu News | Updated on : 10 July 2022, 6:00 am

Tholi Ekadashi : ప్రాచీన కాలం తొలి ఏకాదశి రోజుని ఈ సంవత్సరం ప్రారంభంగా పరిగణించేవారట. ఇప్పుడు వర్షాకాలం మొదలయ్యే సమయం కాబట్టి మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. లంఖణం పరమ ఔషధం అను ఉపవాస దీక్షకు తొలి ఏకాదశే నాంది. పురాణాల ప్రకారం ఆషాడమాసంలో పౌర్ణమికి ముందు ఏకాదశి వస్తుంది. దీనిని తొలి ఏకాదశి అంటారు. అయితే ఈ ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. నారాయణుడు నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండి, జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం విష్ణుమూర్తిని ఆరాధించి తీర్థప్రసాదాలను తీసుకోవాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి రోజున నిద్రపోయే స్వామి వారు మరల నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మళ్లీ నిద్ర నుంచి మేల్కొంటాడు. స్వామివారి యోగ నిద్ర ద్వారా భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెబుతుంటారు.

అలాగే కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వరంతో దేవతలను, ఋషులను హింసించాడని కథ పురాణాల్లో ఉంది. అయితే విష్ణు నారాయణుడు ఆ రాక్షసుడితో వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో స్వామివారి తనువు నుంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుడిని హతమార్చిందని చెబుతారు. అందుకు సంతోషించిన నారాయణుడు ఆ కన్యను ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి బదులుగా ఆమె విష్ణు ప్రియ గా పూజలు అందుకోవాలి అని కోరుకుంటుంది. ఆ రోజు నుంచి ఏకాదశి తిధి గా వాడుకలోకి వచ్చిందని చెబుతారు. ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు చేయాలంటే ఏకాదశి అనగా పదకొండు. అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం పదకొండు. మనిషి దేవుడిని పూజించేటప్పుడు వీటిని తన ఆధీనంలోకి తీసుకొచ్చి ఒకటిగా చేసి దేవుడికి నివేదన ఇవ్వాలి. దీని వలన మనిషికి బద్ధకం దూరమవుతుంది. అలాగే రోగాలు కూడా రాకుండా ఉంటాయి.

how do lord sri mahavishnu pooja in tholi ekadashi festival

how do lord sri mahavishnu pooja in tholi ekadashi festival

స్వామివారు నిద్రించే ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా భావించి చతుర్మాస దీక్ష చేస్తారు. ఈ దీక్ష ను చేసేవారు నాలుగు నెలల పాటు ఎటువంటి ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను వదిలేస్తారు. ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటిస్తారు. ఉపవాసం చేయడం వలన జీర్ణ కోసం పరిశుద్ధమై శరీరం నూతన ఉత్తేజాన్ని రూపొందించుకుంటుంది. శరీరం తట్టుకోలేని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం కోసం ఈ కఠినమైన ఉపవాసాలు, నియమాలు ఏర్పడ్డాయి. వీటి వలన మనిషి కామ క్రోధాధులను వదిలించుకోగలుగుతాడు. అయితే ఈ తొలి ఏకాదశి రోజున పేలపిండిని తినే సాంప్రదాయం ఉంది. పేలాల్లో బెల్లం, యాలకులను వేసి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఈ పిండి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. వర్షాకాలం ప్రారంభ సమయం కాబట్టి శరీరానికి ఈ పేలపిండి వేడిని కలిగిస్తుంది. అలాగే మన శరీరానికి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Advertisement

Anusha V

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి