Ghatkesar : కార్యేషుదాసి అన్న ఆర్యోక్తిని నిజం చేసిన అర్ధాంగులు ..!
ప్రధానాంశాలు:
Ghatkesar : కార్యేషుదాసి అన్న ఆర్యోక్తిని నిజం చేసిన అర్ధాంగులు ..!
Ghatkesar ఘట్కేసర్ మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో రెండు కుటుంబాలు ఎదుర్కొంటున్న జీవన సంగ్రామం ఎంతో హృదయాన్ని కదిలించేలా ఉంది. ఒకే ఇంటికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గత 16 ఏళ్లుగా పక్షవాతంతో పోరాడుతూ మంచానికే పరిమితమయ్యారు. అయితే వారి జీవితాల్లో ధైర్యంగా నిలిచిన వారి భార్యలు భవానీ, సంధ్య నిజమైన జీవిత భాగస్వాములుగా సేవలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంకుషాపూర్ గ్రామానికి చెందిన బత్తుల కిష్టమ్మ కుమారులు భిక్షపతి (51), శ్రీరాములు (43) ఒకప్పుడు కుటుంబాన్ని ఆదుకునే ప్రధాన ఆధారంగా ఉండేవారు. కానీ విధి వీరిని పక్షవాతం రూపంలో పరీక్షించింది. దాదాపు 16 సంవత్సరాలుగా వీరిద్దరూ శరీరం కదలలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యారు. రోజువారీ పనులు కూడా చేయలేని స్థితి రావడంతో వారి కుటుంబాలపై పెద్ద భారమే పడింది. అయినప్పటికీ వారు జీవితం పట్ల ఆశను కోల్పోకుండా ప్రతి రోజూ పోరాటం కొనసాగిస్తున్నారు.
భిక్షపతి భార్య భవానీ, శ్రీరాములు భార్య సంధ్య తమ భర్తలను కన్నతల్లిలా చూసుకుంటున్నారు. వారి ఆరోగ్యం, ఆహారం, మందులు అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. భర్తలు మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా వారి భావాలను అర్థం చేసుకుని సేవలందించడం నిజంగా గొప్ప విషయం. రోజువారీ కష్టాలు ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ నిరుత్సాహపడకుండా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు. “కార్యేషు దాసి” అనే ఆర్యోక్తి వాస్తవ జీవితంలో ఎలా ఉంటుందో భవానీ, సంధ్యలు చూపిస్తున్నారు. భార్య అంటే కేవలం కుటుంబ సభ్యురాలు మాత్రమే కాదు, అవసరమైనప్పుడు తల్లి, సేవకురాలు, స్నేహితురాలు అన్నీ అవుతుందని వారు నిరూపిస్తున్నారు. తమ భర్తల కష్టాల్లో తోడుగా నిలిచి అర్ధాంగుల అర్థానికి నిజమైన జీవం పోస్తూ సమాజానికి గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు. వారి త్యాగం, సహనం గ్రామస్తులను మాత్రమే కాదు ఈ కథ విన్న ప్రతి ఒక్కరినీ కదిలించేలా ఉంది.