Jobs : రాబోయే 5 ఏళ్లలో 20 వేల ఉద్యోగాలు.. నిరుద్యోగుల ఎదురుచూపులు తెరపడినట్లే !!
కరోనా మహమ్మారి, ఏఐ టెక్నాలజీల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ, టెక్ కంపెనీలలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న సమయంలో పీడబ్ల్యూసీ ఇండియా ఒక శుభవార్త ప్రకటించింది. ‘విజన్ 2030’ పేరిట ఒక కీలక ప్రణాళికను వెల్లడించింది. దీని ప్రకారం, రాబోయే ఐదేళ్లలో కంపెనీ ఆదాయాన్ని మూడు రెట్లు పెంచుకోవడమే కాకుండా, భారతదేశంలో మరో 20 వేల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యంతో 2030 నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 50 వేలకు పెంచాలని నిర్ణయించింది.

Jobs : రాబోయే 5 ఏళ్లలో 20 వేల ఉద్యోగాలు.. నిరుద్యోగుల ఎదురుచూపులు తెరపడినట్లే !!
పీడబ్ల్యూసీ తన ఆదాయంలో 5 శాతానికి పైగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, సామర్థ్యాల పెంపు వంటి వాటిపై పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సస్టెయినబిలిటీ, రిస్క్ అండ్ రెగ్యులేటరీ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక వ్యాపార రంగాలపై సంస్థ తన దృష్టిని కేంద్రీకరిస్తోంది. దీనితో పాటు, ఉద్యోగుల నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచడానికి ఆదాయంలో 1 శాతం పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ వ్యూహం ద్వారా, మారుతున్న క్లయింట్ల అవసరాలను తీర్చడమే కాకుండా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఒక బలమైన వర్క్ఫోర్స్ను నిర్మించాలని పీడబ్ల్యూసీ లక్ష్యంగా పెట్టుకుంది.
పీడబ్ల్యూసీ తన కార్యకలాపాలను కేవలం మెట్రో నగరాలకే పరిమితం చేయకుండా, టైర్ 2, 3 నగరాలకు కూడా విస్తరించనుంది. ఈ వికేంద్రీకృత వృద్ధి (Decentralised Model) నమూనా ద్వారా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని సంస్థ భావిస్తోంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో, టెక్నాలజీ, మీడియా, టెలికాం వంటి ఆరు కీలక రంగాలపై దృష్టి సారించి, దేశ అభివృద్ధిలో భాగం కావాలని పీడబ్ల్యూసీ ఇండియా చైర్పర్సన్ సంజీవ్ క్రిషన్ వెల్లడించారు. ఈ ప్రణాళికలు భారతదేశ ఆర్థిక వృద్ధికి, యువతకు మంచి ఉద్యోగ అవకాశాలను అందించడానికి దోహదం చేస్తాయని ఆశిస్తున్నారు.