YS Sharmila : మరోసారి వైయస్సార్ సీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల..!

 Authored By aruna | The Telugu News | Updated on :29 January 2024,9:30 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : మరోసారి వైయస్సార్ సీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల..!

YS Sharmila : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోసారి వైఎస్ షర్మిల తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కడప జయ గార్డెన్స్ లో ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి వైయస్ షర్మిల హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం తో పాటు రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, గిడుగు రుద్రరాజు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల తన తండ్రి పాలనకు ఇప్పుడున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని తెలిపారు. వైసీపీని అధికారంలో తేవడానికి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, జగనన్న కోసం అంత గొప్ప త్యాగం చేస్తే తన పైన ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నారని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకొక జోకర్ గాడు బయటికి వచ్చి తనపై వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని, రోజుకో కట్టు కథ పుట్టించి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. వైయస్ జగన్ ను జైల్లో పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధం అని వైయస్ షర్మిల అన్నారు. సోనియా గాంధీ వద్దకు అనిల్, భారతీ రెడ్డితో కలిసే వెళ్లారని గుర్తు చేశారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, పదవి కాంక్ష ఉంటే నాన్న సీఎంగా ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళం కదా అని ప్రశ్నించారు. జగనన్న కోసం పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను పదవి అడగలేదని వైసీపీ వారికి దమ్ముంటే ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడిగి తెలుసుకోండి అని వైయస్ షర్మిల సవాల్ విసిరారు. సాక్షి పత్రికలో నా పైన వ్యక్తిగతంగా వార్తలు రాస్తున్నారు. కానీ ఆ పత్రికలో జగనన్నకు ఎంత భాగస్వామ్యం ఉందో నాకు అంతే భాగం ఉందని వైయస్ షర్మిల స్పష్టం చేశారు.

ఈ విషయం మరిచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఏం రాసినా ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదని వైయస్ షర్మిల అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒక కలలా మిగిలిపోయిందని, వైయస్సార్ బ్రతికే ఉంటే కడపకు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేది అని, అంతేకాకుండా కడప జిల్లాకు ఆయన ఇంకా ఎంతో చేసేవారని షర్మిల అన్నారు. జగనన్న కడప జిల్లా వాసిగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయారని, కడప బెంగుళూరు రైల్వే నిర్మాణం ఆగిపోయేలా చేశాడని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ఇప్పటి వరకు ఆదుకోలేదని అన్నారు. ఇంకా జగనన్నకు కడప జిల్లాపై ప్రేమ ఉందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. బీజేపీకి వైసీపీ బానిసై అన్ని విషయాలలో మద్దతు ఇస్తుందని అన్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి