Burgampahad : 70 ఏళ్ల వయస్సులోనూ చెక్కుచెదరని స్నేహం.. బూర్గంపహాడ్లో పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ కలయిక..!
ప్రధానాంశాలు:
Burgampahad : 70 ఏళ్ల వయస్సులోనూ చెక్కుచెదరని స్నేహం.. బూర్గంపహాడ్లో పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ కలయిక..!
Burgampahad : పూర్వ విద్యార్థుల అనుబంధం ఎంత గొప్పదో, నిజమైన స్నేహం కాలంతో మసకబారదనే విషయాన్ని బూర్గంపహాడ్లో జరిగిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ కలయిక మరోసారి నిరూపించింది. “స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా… కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా” అనే పాటకు అర్థం చెబుతూ, ఏడు పదుల వయస్సులోనూ తమ అనుబంధాన్ని నిలబెట్టుకున్న పూర్వ విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1967-68 విద్యాసంవత్సరానికి చెందిన విద్యార్థులు ఆదివారం స్వర్ణోత్సవ కలయికను ఘనంగా నిర్వహించారు. జక్కం పెద్ద బుచ్చయ్య మెమోరియల్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమం ఆహూతులను, స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

Burgampahad : 70 ఏళ్ల వయస్సులోనూ చెక్కుచెదరని స్నేహం.. బూర్గంపహాడ్లో పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ కలయిక..!
ప్రముఖ వైద్యుడు డాక్టర్ చెన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 70 ఏళ్లకు పైబడిన సుమారు 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుతం వీరిలో చాలామంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, రైతులు, వ్యాపారవేత్తలుగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. కొందరు మాజీ నక్సల్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక్కచోట చేరి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాల రోజులలో జరిగిన సంఘటనలు, అప్పటి ఉపాధ్యాయులు, స్నేహితులతో గడిపిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఆనందభాష్పాలు పెట్టుకున్నారు.
Burgampahad ఐదు దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు
ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఒకరినొకరు పలకరించుకుంటూ, తమ ప్రస్తుత జీవనశైలి, కుటుంబ విషయాలు, ఆరోగ్య పరిస్థితులను పంచుకున్నారు. వయస్సు పెరిగినా తమ స్నేహబంధం మాత్రం ఏమాత్రం తగ్గలేదని అందరూ పేర్కొన్నారు.ఈ సందర్భంగా జూనియర్ కళాశాల డోనర్ జక్కం గోపయ్య సేవలను స్మరించుకున్నారు. అలాగే తమ మధ్య లేని స్నేహితులను గుర్తుచేసుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు భావోద్వేగానికి గురయ్యారు.
కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరి సహపంక్తి భోజనాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుక ద్వారా తమ చిన్ననాటి స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని వారు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ చెన్నం సత్యనారాయణను పూర్వ విద్యార్థులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కలయికలను కొనసాగించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చందా లింగయ్యదొర, బూర్గంపహాడ్ సర్పంచ్ మందా నాగరాజు, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.






