Ananthapuram.. మహిళల రక్షణ కోసమే ‘దిశ’: ఎమ్మెల్సీ ఇక్బాల్

 Authored By praveen | The Telugu News | Updated on :5 September 2021,8:22 pm

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పొలిట్ బ్యూరో మెంబర్ వర్లరామయ్య అవగాహన లేకుండానే అర్థరహితంగా రాష్ట్ర హోం మంత్రి, డీజీపీపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ఆదివారం అనంతరం‌పురం జిల్లాలో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత కోసం వైసీపీ సర్కారు పని చేస్తున్నదని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి మహిళల భద్రతపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మహిళల రక్షణ కోసమే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు.

ఆ చట్టం ద్వారానే నేరం జరిగిన వారం రోజుల్లో పోలీసులు చార్జిషీట్ వేస్తున్నారని వివరించారు. అలా నేరం జరిగిన ఏడు రోజుల్లోనే చార్జిషీట్ వేస్తున్న ఘనత ఏపీ పోలీసులకే దక్కుతుందని చెప్పారు. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ వివరించారు. ‘దిశ’ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కావాలని, అప్పుడే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పడుతాయని చెప్పారు. టీడీపీ నేతలు ‘దిశ’ చట్టం ఆమోదం పొందేలా కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధమైన న్యాయవ్యవస్థ పోలీసు వ్యవస్థకు టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ డిమాండ్ చేశారు.

 

praveen

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి