Medak : ఇంజినీరింగ్ కళాశాలలో దారుణం .. విద్యార్థినిపై లైంగిక దాడి
ప్రధానాంశాలు:
Medak : ఇంజినీరింగ్ కళాశాలలో దారుణం .. విద్యార్థినిపై లైంగిక దాడి
Medak : మెదక్ జిల్లాలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అదే కాలేజీకి చెందిన విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాక ఆ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిజాంపేట్ శ్రీనివాస్ నగర్కు చెందిన ఓ విద్యార్థిని ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న ఆశిష్ అనే విద్యార్థి ఆమెకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. 2024 సంవత్సరం నుంచి ప్రేమ పేరుతో ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
గత సంవత్సరం కాలేజీ ప్రాంగణంలోనే మత్తు కలిపిన చాక్లెట్ ఇచ్చి ఆమెపై లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఘటన తరువాత కూడా పలుమార్లు దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆశిష్ తన స్నేహితుడు, అదే కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి ప్రవీణ్ను బాధితురాలికి పరిచయం చేశాడు. అనంతరం ప్రవీణ్ కూడా ఆమెను లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కాలేజీ యాజమాన్యానికి ఈ ఘటనపై ముందుగానే సమాచారం ఉన్నట్లు తెలిసింది. అప్పట్లోనే ఆశిష్ తల్లిదండ్రులను పిలిపించి డిక్లరేషన్ రాయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ చర్యల తర్వాత కూడా ఘటనలు కొనసాగడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.