Business Idea : దేనికీ పనికి రాని భూమిలో సహజంగా పంట పండిస్తూ ఏడాదికి 40 లక్షలు సంపాదిస్తున్న టెకి
Business Idea : సాధించాలన్న తపన ఉండాలే కానీ బీడు భూమిలో కూడా బంగారం పండించొచ్చు. అదే చేసి చూపాడు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన స్వస్తిక్ ఫార్మ్స్ వ్యవస్థాపకుడు మన్ దీప్ వర్మ. సేంద్రీయ పద్ధతుల్లో కీవి పండ్లను పండిస్తూ ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్నాడు వర్మ.హిమాలయాల దిగువన ఉన్న సోలాన్ జిల్లా షిల్లీ అనే గ్రామంలో పుట్టాడు మన్ దీప్ వర్మ. ఎంబీఏ పూర్తి చేసి ఢిల్లీలో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో రాజధానికి వెళ్లాడు. నాలుగున్నరేళ్లుగా పని చేసినా వర్మకు… తన చేస్తున్న పనిలో ఏమాత్రం సంతృప్తి దొరకలేదు. కెరీర్ గ్రోత్ కూడా అంతగా లేకపోవడంతో తన ఉద్యోగం మానేసి ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాడు.
కానీ ఏం చేయాలి ఎలా చేయాలో తనకు తెలీదు. కొంత సమయం వెచ్చించి పరిశోధన ప్రారంభించాడు. ఆఖరికి సేంద్రీయ వ్యవసాయం చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. స్వగ్రామం షిల్లిలో 4.84 ఎకరాలు భూమి ఉండటంతో దానిలోనే ఏదైనా చేయాలనుకున్నాడు. కానీ అది పూర్తిగా బీడు భూమి కావడంతో దానిని చదును చేశాడు. హిమాలయాల దిగువన భూముల్లో సహజసిద్ధ పోషకాలు, భూసారం ఉంటుందని దానితోనే సాగు చేయాలని బలంగా అనుకున్నాడు.ఇంటర్నెట్ని ఉపయోగించాలని అవగాహన పెంచుకున్నాడు. వందలాది వీడియోలను చూశాడు. సేంద్రీయ మరియు సహజ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఆహారాన్ని పండించడానికి అవసరమైన వివిధ అంశాల గురించి నేను తెలుసుకున్నాడు.

Business Idea in entrepreneur quits job to farm organic fruits earns lakhs
వ్యవసాయ పత్రికలను రోజూ చదివేవాడు. స్థానిక అధికారులు మరియు ఉద్యానవన శాఖలో పనిచేసే నిపుణుల నుండి కొంత జ్ఞానం సంపాదించాడు. ఇలా వివరాలు, సబ్జెక్టు నేర్చుకుంటున్న సమయంలోనే కోతుల బెడద గురించి తెలిసింది. దీని గురించి నిపుణుల ముందు ప్రస్తావించినప్పుడు కివీ పండ్లు పండించమని వారు సలహా ఇచ్చారు. కివీ పండ్లు మొదట పుల్లగా ఉండటంతో పాటు జుట్టు లాంటి ఉపరితలం కలిగి ఉంటాయి. అందుకే ఈ పండ్ల జోలికి కోతులు రావని వాటినే సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భూమిలో ఇప్పుడు కివీ పండ్లు పండిస్తూ ఏడాదికి సుమారు రూ. 40 లక్షలు సంపాదిస్తున్నాడు మన్ దీప్ వర్మ. ఇవి పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండి పండ్లు కావడంతో మంచి గిరాకీ ఉందని చెబుతున్నాడు వర్మ.