Ys Jagan : ప్రభుత్వానికి దగ్గరగా.. పార్టీకి దూరంగా.. ఇలా అయితే క‌ష్టం జ‌గ‌న‌న్న‌..!

Authored By Akkirala | The Telugu News | Updated on : 7 June 2021, 8:24 pm

Ys Jagan : అధికార పార్టీ అధ్యక్షుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఈ రెండు పదవుల్లోనూ ఒకే వ్యక్తి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి తలెత్తటం సహజం. ఆ రెండు పోస్టుల మధ్య సమన్వయం సాధించటం అంత ఈజీ కాదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబే ఈ జోడు గుర్రాల బండిని నడపలేక రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. పార్టీకి ఇంకాస్త ఎక్కువ సమయం కేటాయించి ఉంటే ఇలాంటి చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చేది కాదంటూ బాధపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చాణక్యుడిలా పేరు సంపాదించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కూడా ఈ డబుల్ టాస్క్ ని డీల్ చేయలేక పార్టీ బాధ్యతలను 90 శాతం తన కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి అప్పగించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా తన చేతిలోని బీజేపీ పగ్గాలను జేపీ నడ్డాకి ఇచ్చారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏపీలో వైఎస్ జగన్ సైతం తన పార్టీ(వైఎస్సార్సీపీ)పై ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సర్కారే సర్వస్వమా..

వైఎస్ జగన్ తొలిసారి అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రజల కోసమే సాధ్యమైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాగే చేస్తున్నారు. సర్కారే సర్వస్వం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీకి దూరమవుతున్నారు. ఫలితంగా పార్టీలోని అంతర్గత కలహాలు అంత తేలిగ్గా పరిష్కారం కావట్లేదు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 30 నుంచి 40 చోట్ల ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేకి, పార్టీ ఇన్ఛార్జ్ కి మధ్య పడట్లేదు. పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవటంతో వాళ్ల మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. ఆ ప్రభావం పార్టీ మీద పడుతోంది. ఇదే పరిస్థితి 2024 ఎన్నికల దాకా కొనసాగితే కష్టమని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి జగన్.. ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో పార్టీకీ అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలని కేడర్ కోరుతోంది.

ysrcp president ys jagan

ysrcp president ys jagan

ఎక్కడెక్కడ..

చీరాల, కొడుమూరు, నందికొట్కూరు, జమ్మలమడుగు తదితర సెగ్మెంట్లలో పార్టీ బాధ్యులకు, ప్రజాప్రతినిధులకు మధ్య కోఆర్డినేషన్ కొరవడుతోంది. అధ్యక్షుడు జగన్ ఒకటీ రెండు నియోజకవర్గాల్లోని ఇలాంటి సమస్యలను దగ్గరుండి పరిష్కరించారు. మరికొన్నింటిని చక్కదిద్దాలంటూ పార్టీ పెద్దలను పురమాయించారు. వాళ్లు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా దారికి రావట్లేదు. ఈ నేపథ్యంలో జగనే జోక్యం చేసుకోవాలని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పెద్ద సారు ఏం చేస్తారో ఏమో చూడాలి. అధికారం అనే గొడుగు కింద అవే సర్దుకుంటాయని లైట్ తీసుకుంటారా లేక పిలిపించి మాట్లాడతారా అనేది కాలమే చెప్పాలి. జిల్లాల పర్యటనలు, ప్రభుత్వ పథకాల సమీక్షల్లో భాగంగా అధికారులతోపాటు శాసన సభ్యులతో మాట్లాడటం కాకుండా రెగ్యులర్ గా పార్టీ పనితీరునూ సమీక్షించాలని, శాసన సభ్యులు, పార్టీ ఇన్ఛార్జ్ లతో కూడా డైరెక్టుగా మాట్లాడాలని ఆశిస్తున్నారు. ఒకానొక సందర్భంలో జగన్ చంద్రబాబును విమర్శిస్తూ ఆయన జూమ్ కి దగ్గరగా, భూమికి దూరంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జగన్ కూడా ప్రభుత్వానికి దగ్గరగా, పార్టీకి దూరంగా ఉన్నారనే బ్యాడ్ ఫీడ్ బ్యాక్ పొందకూడదనేదే అందరి సదుద్దేశం.

ఇది కూడా చ‌ద‌వండి ==> చంద్ర‌బాబుకు భారీ షాక్‌.. పార్టీ మార‌నున్న టీడీపీ అధ్య‌క్షుడు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : వైఎస్ జగన్ ఫ్యామిలీపై.. విపక్షాల వింత, విచిత్ర అంచనాలు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Roja : త్వరలో మంత్రి అవుతున్న రోజా

ఇది కూడా చ‌ద‌వండి ==> Jr.NTR : కుప్పంలో బాబుకు షాక్.. జూ.ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు అంటూ..!

Advertisement

Akkirala

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి